బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా మొదటి నుంచి ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటోంది. రిలీజైంది. డిజాస్టర్ అయ్యింది. కంగనా డబ్బులు చాలా పోయాయి. ఓటిటి చాలా తక్కువ రేటుకు తీసుకుంది. అంతా ఓకే అనుకున్న సమయంలో మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్, ప్రముఖ ప్రసార సంస్థ నెట్ఫ్లిక్స్పై ఒప్పంద ఉల్లంఘన, పరువు నష్టం దావా వేశారు సీనియర్ జర్నలిస్టు, రచయిత కూమి కపూర్.
వివరాల్లోకి వెళితే..
సీనియర్ జర్నలిస్టు, రచయిత కూమి కపూర్ రచించిన ‘ఎమర్జెన్సీ: ఎ పర్సనల్ హిస్టరీ’ అనే పుస్తకం ఆధారంగానే ‘ఎమర్జెన్సీ’ సినిమా రూపొందించడానికి ఎగ్రిమెంట్ జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే తన అనుమతి లేకుండా తన పేరును, తన పుస్తకాన్ని ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకున్నారని ఆమె ఆరోపించారు.
ఈ సినిమాలో తప్పులు ఉన్నాయి వాటిని నెట్ఫ్లిక్స్ వెర్షన్ నుంచి తొలగించాలని చెప్పినప్పటికీ వారు ఆ సన్నివేశాలను తొలగించలేదని ఆమె పేర్కొన్నారు.
‘‘ఈ పుస్తక హక్కులను కొనుగోలు చేసేటప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నాం. అందులో రచయిత అనుమతి లేకుండా ప్రచారం కోసం ఆమె పేరు, పుస్తకాన్ని ఉపయోగించకూడదని పేర్కొన్నాం. ఆ సమయంలో నేను గోవాలో ఉన్నాను. స్క్రిప్ట్ను చూడలేకపోయాను. వాళ్లు ఆ ఒప్పందాన్ని గౌరవిస్తారు అనుకున్నా.
కానీ వాళ్లు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఈ సినిమా ‘ఎమర్జెన్సీ: ఎ పర్సనల్ హిస్టరీ’ అనే పుస్తకం ఆధారంగా రూపొందిందని ప్రచారం చేశారు. ఆ తర్వాత వారికి లీగల్ నోటీసులు పంపించాను. కానీ వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు’’ అని అన్నారు. అందుకే నిర్మాతలు, నెట్ఫ్లిక్స్ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించానని ఆమె పేర్కొన్నారు.